దర్శక దిగ్గజం శంకర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చి చాలా రోజులే అవుతున్నా, దీనిపై ఒక్క అప్డేట్ కూడా రాలేదు.30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని శంకర్ ఇప్పుడు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. దీని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్.
రామ్ చరణ్ చిత్రం కోసం శంకర్ మూడేళ్ల సమయం తీసుకుంటాడనే ప్రచారం ఒకటి జోరుగా నడుస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ.. స్పెషల్ సీన్స్ కానీ ఉండవంటున్నాడు ఈ దర్శకుడు. ఇదంతా ఇలా ఉంటే రామ్ చరణ్ సినిమా కంటే భారతీయుడు 2 సినిమాను ముందుగా పూర్తి చేయాలని శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ కోర్టులో కేసు ఫైల్ చేసారు. కానీ ఈ కేసును కోర్టు కొట్టేసింది. దాంతో అతిపెద్ద ఊరట లభించింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు భారతీయుడు 2 ఎలాంటి అడ్డంకి కాబోదు. లైకా ప్రొడక్షన్స్ భద్రతను సమకూర్చడానికి దాఖలు చేసిన దరఖాస్తు సహా అన్ని దరఖాస్తులను హై కోర్టు కొట్టివేసింది.
ఈ క్రమంలో శంకర్ తన సినిమా స్పీడ్ పెంచాడు. రీసెంట్గా హీరో రామ్చరణ్, నిర్మాత ‘దిల్’ రాజు చెన్నైలో దర్శకుడు శంకర్ను కలిశారు. శంకర్ దంపతుల ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన రామ్చరణ్, త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్లో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇందులో కథానాయికగా కియారా అడ్వాణీని ఎంపిక చేశారట. తమన్ స్వరాలు అందించనున్నారు.