జిల్లావ్యాప్తంగా నమోదైన సగటు వర్షపాతం 31.5 మి.మీ.
చెరువుల్లోకి చేరిన జలం.. పొంగిపొర్లిన వాగులు
వానకాలం ఆరంభంలో కరుణిస్తున్న వరుణ దేవుడు
సాగుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులతో రైతన్నలకు ఊరట
ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు
యాదాద్రి భువనగిరి, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ఆరంభంలో వరుణ దేవుడు రైతన్నలపై కరుణ చూపిస్తున్నాడు. సాగుకు అనుకూలంగా జిల్లాలో వానలు పడుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. వాగుల్లో వరద నీరు ఉప్పొంగగా.. చెరువుల్లోకి సైతం సమృద్ధిగా నీరు చేరింది. సీజన్ ఆరంభంలో కురుస్తున్న వర్షాలు రైతన్నలకు ఊరటకలిగిస్తున్నాయి. జిల్లాలో సగటున 31.5 మి.మీ వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 135.4 మి.మీ వర్షపాతం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కారణంగా ఉక్కపోతతో సతమతమైన జిల్లా ప్రజానీకం ప్రస్తుత వర్షంతో ఉపశమనం పొందింది.
ఆశించిన రీతిలో వర్షాలు
వర్షాకాలం మొదలైందే తడువు జిల్లాలో ఆశించిన రీతిలో వర్షాలు కురుస్తున్నాయి. ఆలేరు, మోటకొండూరు, అడ్డగూడూరు మండలాలు మినహా మిగతా 14 మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బుధవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కురియడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. జూన్ 1 నుంచి వర్షాకాలం ప్రారంభం కాగా.. 7.3 మి.మీ సాధారణ వర్షపాతానికిగాను గడచిన మూడు రోజుల్లో 41.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వరద నీటితో వాగులు ఉప్పొంగగా.. పలు చెరువుల్లోకి వర్షం నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. మొదటి వర్షాలకు సంప్రదాయబద్ధంగా విత్తనాలను విత్తుకోవడం ఆనవాయితీగా వస్తుండగా.. గురువారం అక్కడక్కడ రైతులు దుక్కులు దున్నడం.. విత్తనాలు విత్తుకోవడం వంటి వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జిల్లాలో 31.5 మి.మీ సరాసరి వర్షపాతం నమోదు
జిల్లాలోని 14 మండలాల్లో వర్షం పడగా.. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 135.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా రామన్నపేట మండలంలో 5.0 మి.మీ నమోదైంది.
చౌటుప్పల్లో భారీ వర్షం
చౌటుప్పల్ జూన్ 3 : చౌటుప్పల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమై పెద్ద పెద్ద చినుకులతో కూడిన వర్షం పడింది. సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వర్షం ఆగిపోయింది. కాగా కురిసిన వర్షానికి మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, తండపల్లి చెరువులతో పాటు పలు కుంటల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది.
పలకరించిన తొలకరి వర్షం
ఆలేరు టౌన్, జూన్ 3 : గత కొద్దిరోజులుగా ఎండలకు తాళలేక జనం ఇబ్బందులు పడ్డారు. జూన్ 1న వానకాలం సీజన్ ప్రారంభమైంది. రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు. తొలకరి వర్షం పలకరించడంతో పంట భూమిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఏరివేసి కాల్చివేస్తున్నారు.
అడ్డగూడూరులో మోస్తరు వర్షం
అడ్డగూడూరు, జూన్ 3: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వర్షం రావడంతో ప్రజలు సేద తీరారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యరు.
మండలం వ్యాప్తంగా వర్షం
సంస్థాన్నారాయణపురం, జూన్ 3: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.దీంతో నారాయణపురంలో గుడిగుట్ట వద్ద ఉన్న చెక్డ్యాం నిండి అలుగుపారుతున్నది. భారీ వర్షానికి గుడిమల్కాపురంలో చిన్న వాగు,పెద్దవాగు ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూడటానికి తరలివచ్చారు.రోడ్లు,డ్రైనేజీలు వర్షపు నీటితో నిండిపోయాయి.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం), జూన్3: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.
మోత్కూరులో…
మోత్కూరు , జూన్ 3 : నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షం కురిసింది. రోహిణి కార్తె సగం పాదంలో కురిసిన వర్షానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్తెలో కురిసిన వర్షం మెట్ట పంటలు సాగు చేయటానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పత్తితోపాటు సంప్రదాయ పంటలైన కంది, పెసర, నువ్వులు, జీలుగ, వేరుశనగ, ఉలువలు, ఆముదం, మినుముల పంటల సాగుకు కలిసి రానుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. పత్తి పంట సాగుకు మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, మోటాకొండూరు, ఆలేరు, వలిగొండ మండలాల్లో నల్లరేగడి భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం వానకాలం పంటల సాగు కోసం కావాల్సిన విత్తన ఎరువులను దుకాణాల్లో నిల్వ చేసింది.
భూదాన్పోచంపల్లిలో…
భూదాన్పోచంపల్లి, జూన్ 3 : మండలం వ్యాప్తం గా గురువారం తెల్లవారు జాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండలం వ్యాప్తంగా 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.