ప్రస్తుతం తెలుగులో తనకు సినిమా అవకాశాలు లేవని అన్నట్ల్లు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనంపై అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారో అని అసహనం వ్యక్తం చేసింది. ‘ఆ వార్తను చూసి నాకు ఆశ్చర్యమేసింది. తెలుగులో అవకాశాలు లేవనే స్టేట్మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఏడాదికి ఎవరికైనా 365రోజులే ఉంటాయి. ప్రస్తుతం నేను ఆరు సినిమాలు చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ సినిమాల్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలో సదరు మీడియా వారు చెబితే బాగుంటుంది’ అంటూ ట్విట్టర్లో వ్యంగ్యంగా సమాధానమిచ్చింది రకుల్ప్రీత్సింగ్. ప్రస్తుతం ఆమె తెలుగులో వైష్ణవ్తేజ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకుడు. ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు హిందీలో రకుల్ప్రీత్సింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.