ఢిల్లీ : భారత నావికాదళం మొదటి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ను 21మే,2021(శుక్రవారం) తన 41 సంవత్సరాల అనంతరం డీ కమిషన్ చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. ఐఎన్ఎస్ రాజ్పుత్ గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్ అదేవిధంగా భారత నావికాదళానికి చెందిన రాజ్పుత్ తరగతికి చెందిన ప్రధాన నౌక. యూఎస్ఎస్ఆర్ నిర్మించి అప్పగించిన ఈ ఓడను 4 మే, 1980లో భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. గులాబ్ మోహన్లాల్ హిరానందాని ఐఎన్ఎస్ రాజ్పుత్ మొదటి కమాండింగ్ అధికారి.
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ట్రయల్ ప్లాట్ఫామ్గా రాజ్పుత్ పనిచేసింది. పృథ్వీ -3 క్షిపణి కొత్త వేరియంట్ మార్చి 2007న రాజ్పుత్ నుండి పరీక్షించబడింది. ఇది భూ లక్ష్యాలపై కూడా దాడి చేయగలదు. అదేవిధంగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ సైబ్మెరైన్ రోల్స్, క్యారియర్ ఎక్కార్ట్గా విధులను నెరవేర్చగలదు. అలాగే 2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ట్రాక్ చేసిన రికార్డు రాజ్పుత్ సొంతం.
నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘంగా సేవలందించిన ఈ ఓడ 21 మే, 2021న డీ కమిషన్ కాబోతుంది. విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో జరిగే కార్యక్రమంలో ఐఎన్ఎస్ రాజ్పుత్కు వీడ్కోలు నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ మంది సమక్షంలో ఈ వీడ్కోలు కార్యక్రమం కొనసాగనుంది.
దేశాన్ని ఎల్లప్పుడు సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్కు సహాయంగా ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు ఆపరేషన్ కాక్టస్, లక్షద్వీప్కు చెందిన ఆపరేషన్ క్రోవ్నెస్ట్ తదితరాలు ఉన్నాయి.