హైదరాబాద్ : ఆమె భర్త చనిపోయాడు. బతుకు భారం అయింది. ఉన్న ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పేదరికం. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు కరోనా మహమ్మారి వల్ల కుటుంబం కడుపునింపుకునే కాస్తా అదెరువు కూడా కరువైంది. ఫలితంగా బస్టాండ్లోనే ఎప్పుడో ఒకప్పుడు దొరికే అన్నం పొట్లం ఆ ముగ్గురు పిల్లల కడుపు నింపడానికే సరిపోవడం లేదు. తల్లికి ఉపవాసాలు తప్పడం లేదు. ఇది సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట మండలం ధాకూర్కి చెందిన పద్మ దైన్య స్థితి.
ఇది తెలుసుకున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరిగిపోయారు. కంటనీరు పెట్టారు. తల్లిహృదయం తల్లడిల్లింది. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీయాలని, అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాలు వచ్చిన వెంటనే హుటాహుటిన తరలిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పద్మ పరిస్థితిని చూసి చలించి పోయారు. వెంటనే ఆ పిల్లలను హక్కున చేర్చుకున్నారు. వారు బలహీనంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించారు.
కరోనా నెగెటివ్ రావడంతో వెంటనే చిన్న పిల్లల కోసం ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ ప్రత్యేక వాహనంలో ఆమె స్వగ్రామం జోగిపేట- డాకూర్ కు చేర్చారు. కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకు ఇచ్చే అంగన్ వాడీ పోషకాహారం అందించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ తో మాట్లాడి ఆమె సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అంగన్ వాడీ కేంద్ర పర్యవేక్షణలో వారికి కావాల్సిన సంరక్షణ చేపడుతున్నారు.
సరైన సమయంలో సరైన విధంగా స్పందించి చేయుతనందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను, సర్పంచ్ ను మంత్రి అభినందించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి