వారి గురించి ఎంత చెప్పినా తక్కువే
స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వామ్యం
సకలం సమ్మె చరిత్రలోనే అపూర్వం
ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారు మాది
వారి హక్కులను గౌరవిస్తాం
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రశంసలు
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం దృష్ట్యా మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉంటున్నదని తెలిపారు. సోమవారం శాసనసభలో పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించడంతోపాటు వారి సేవలను సీఎం ప్రశంసించారు. స్వరాష్ట్రం కోసం సుదీర్ఘకాలం చేసిన ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు పోషించిన పాత్ర అనిర్వచనీయమైందని, చాలా సాహసోపేతమైనదని గుర్తుచేసుకొన్నారు. ఉద్యోగులంతా వారివారి కొలువులను వదిలి చేసిన సకల జనుల సమ్మె గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో అది గొప్ప మైలురాయి అని కొనియాడారు.
టీఎన్జీవో పేరే ఓ స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో)ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో పేరు ఒక స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ పేరుతో సంఘం పెట్టుకొని ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా పేరు మార్చుకోకుండా, తెలంగాణవాదం విడనాడకుండా ఉన్న ఏకైక సంఘం టీఎన్జీవో అన్నారు.
ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఉద్యోగి గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచుకొంటున్నారని ప్రశంసించారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదని, ఉద్యోగులందరి హక్కులను గౌరవిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇంక్రిమెంటును ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 2014లో పదో వేతన సవరణ చేస్తూ 43% అత్యధిక ఫిట్మెంటును ప్రకటించి, ఉద్యోగులందరిపట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్నదని సీఎం కేసీఆర్ ఉటంకించారు.