రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శేఖర్’. లలిత్ దర్శకుడు. ఎమ్.ఎల్.వి సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం అరకులో ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. శేఖర్ ఎవరు?అతడి అన్వేషణ ఎవరికోసమన్నది ఉత్కంఠను పంచుతుంది. అరకులో ప్రారంభమైన తాజా షెడ్యూల్లో రాజశేఖర్, అనుసితారతో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు సాగే ఈ షెడ్యూల్తో పాటు 75 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది’ అని తెలిపారు. ముస్కాన్ కుబ్ చాందిని, అనుసితార కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లిఖార్జున్ నరగని.