తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో రాజశేఖర్ కూడా కచ్చితంగా ఉంటాడు. 90ల్లో ఈయన సంచలన విజయాలు సాధించాడు. రాజశేఖర్ సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ కూడా అయ్యాయి. చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో పోటీ పడ్డాడు ఈయన. 90ల్లో ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ పాలోయింగ్ ఉండేది. తమిళనాడు నుంచి వచ్చి తెలుగులో జెండా పాతాడు . అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాడు రాజశేఖర్. కరోనా సమయంలో బతికి బయటికి వచ్చిన ఈ సీనియర్ హీరో.. తన కష్టాల గురించి ఇండస్ట్రీ స్నేహితులతో చెప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది.. మార్కెట్ కూడా ఉండేది. కానీ 2000 తర్వాత ఈయన మెల్లగా కనుమరుగు అవుతూ వచ్చాడు.
అప్పుడప్పుడూ ఒకట్రెండు సినిమాలతో మెరవడమే కానీ విజయం అందించింది మాత్రం తక్కువే. అప్పుడెప్పుడో తలంబ్రాలు, వందేమాతరం లాంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి.. అంకుశం, ఆహుతి, మగాడు లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు రాజశేఖర్. ఆ తర్వాత ‘అన్న’, అల్లరి ప్రియుడు’ ‘శివయ్య’, ‘మనసున్న మారాజు’, ‘మా అన్నయ్య’, సింహరాశి, ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ లాంటి విజయాలతో తన రేంజ్ పెంచుకున్నాడు. మూడేళ్ల కింద PSV గరుడ వేగ సినిమాతో ఉనికి చాటుకున్నాడు రాజశేఖర్. కల్కి పర్లేదు అనిపించింది. అయితే ఒకానొక సమయంలో రాజశేఖర్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కనీసం ఈయన సినిమా వచ్చిందంటే పట్టించుకున్న వాళ్లు కూడా లేరు. గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా తెలియదు. వాటిని సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు రాజశేఖర్. అలాంటి సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక చెన్నైలో ఉన్న తన రెండు ఇళ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తన వాళ్లతో రాజశేఖర్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఎవడైతే నాకేంటి సినిమాతో హిట్ కొట్టి గోరింటాకుతో సూపర్ హిట్ అందుకున్నాడు రాజశేఖర్. ఈ రెండు సినిమాలు ఆయన్ని నిలబెట్టాయి. ఆ తర్వాత పదేళ్లకు పీఎస్వీ గరుడ వేగతో గుర్తు చేసాడు రాజశేఖర్. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఓ ప్లాన్ ఫాలో అవుతున్నాడు. సీనియర్ దర్శకులను కాకుండా కుర్రాళ్ళను నమ్ముకుంటున్నాడు ఈయన. ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మతో గరుడ వేగ, కల్కి సినిమాలు చేసిన ఈయన.. ఇప్పుడు కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ వెంకటేష్ మహాతో మర్మాణువు సినిమా చేస్తున్నాడు. వరసగా కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తూ.. నేటి జనరేషన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ప్రశాంత్ వర్మతో మరో సినిమా కూడా చేయాలని చూస్తున్నాడు ఈయన.