బంజారాహిల్స్,మార్చి 6: అతడో సినీ ఫైనాన్సియర్, వ్యాపారి.. ఇంట్లో ఒక్కడే ఉంటాడు.. పనిమనుషులుగా మహిళలను పెట్టుకుని లైంగికదాడికి పాల్పడుతుంటాడు.. ఈ క్రమంలో పనిమనిషిగా రాజమండ్రి నుంచి వచ్చిన ఓ వివాహితను రెండువారాలుగా ఇంట్లో బంధించి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కూతురు ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన వివాహిత(45) భర్తతో విడిపోయి కూతురుతో కలిసి ఉంటోంది. హైదరాబాద్లో నివాసం ఉంటున్న రవీందర్ అనే వ్యక్తి పని ఇప్పిస్తానంటూ చెప్పగా… ఆమె గత నెల 17న రైల్లో ఇక్కడకు వచ్చింది. ఫిలింనగర్ సమీపంలోని ఓ అపార్టుమెంట్లోని 19వ అంతస్తులో ఒంటరిగా నివాసం ఉంటున్న సినీ ఫైనాన్సియర్, వ్యాపారి ఉదయ్భాను (52) ఇంట్లో పనిమనిషిగా చేరింది. కాగా.. చేరిన మరుసటిరోజునుంచే అసభ్యకరమైన రీతిలో మాట్లాడటంతో పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే.. నీతో పాటు నీ కూతురిని చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇదే అదనుగా తీసుకుని రోజూ ఆమెపై లైంగికదాడికి దిగడంతో పాటు శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. బయటకు రాకుండా గదిలో వేసి తాళం వేస్తున్నాడు. 15 రోజులుగా ఇదే రీతిలో నరకం చవిచూసిన బాధితురాలు.. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఫోన్ ద్వారా ఊర్లో ఉంటున్న కూతురికి చెప్పింది. ఆమె ఆన్లైన్లో గాలించి గోల్కొండ పోలీసులకు ఫోన్ చేసి తన తల్లిని ఇంట్లో బంధించారంటూ చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు ఈ ప్రాంతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో వారికి సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో భవనంలోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఉదయ్ భాను మీద ఐపీసీ 342, 376(2),(కే)(ఎన్), 323, 504, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉదయ్భాను పరారవ్వడంతో అతడికోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఉదయ్భానుపై కొంతమంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.