అదేంటి.. తండ్రిపై రాజమౌళికి ఎందుకు అసంతృప్తి ఉంటుంది.. ఆయనే కదా కథలన్నీ ఇచ్చేది.. అక్కడ కానీ తేడా వచ్చిందా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. కాకపోతే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన పనికి రాజమౌళి మాత్రం కాస్త ఫీల్ అయ్యాడని తెలుస్తుంది. ఈయన తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశం అంతా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య త్రిబుల్ ఆర్ సినిమా నిర్మిస్తున్నారు. ఈ వైరస్, లాక్ డౌన్ ఇవన్నీ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఈ మధ్యే చాలా సీక్రేట్స్ బయటపెట్టాడు విజయేంద్ర ప్రసాద్.
సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలు గురించి ఈయన ఓపెన్ అయిపోయాడు. ఆలీతో సరదాగా షో కి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. అందులో త్రిబుల్ ఆర్ సంగతులు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఎలా వచ్చింది అని అడిగినప్పుడు.. అద్భుతంగా వచ్చింది అంటూ ఆసక్తి పెంచాడు విజయేంద్ర ప్రసాద్. సాధారణంగా ఏ సినిమా చూసినా తనకు నిద్ర వస్తుందని.. కానీ ఇందులో కథ ఏంటో తెలుసు.. ఏం జరుగుతుందో తెలుసు అయినా కూడా కన్నార్పకుండా చూశాను అంటూ సినిమాపై అంచనాలు పెంచేశాడు విజయేంద్రప్రసాద్. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం గురించి నోరు జారాడు ఈ సీనియర్ రైటర్. త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అని తెలిపాడు.
ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే కంటి నుంచి నీళ్లు వస్తాయి అంటూ అసలు విషయం బయట పెట్టాడు విజయేంద్ర ప్రసాద్. ఈ సన్నివేశం రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని ప్రశంసించాడు. మరోవైపు సినిమాలో అలియా భట్ పాత్ర గురించి కూడా ఎక్కువ చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. అంత మంది హీరోలు ఉన్నా కూడా హీరోయిన్ గురించి పొగిడేసాడు. దాంతో పాటు సినిమా గురించి మరిన్ని విషయాలు కూడా బయటపెట్టాడు. ఇలా సినిమాకు సంబంధించిన సీక్రేట్స్ బయటపెట్టడంతో తండ్రి చేసిన పనికి రాజమౌళి కాస్త హర్ట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇకపై ఎప్పుడూ ఇలా నోరు జారొద్దని తండ్రిని కోరినట్లు తెలుస్తుంది. మరి 400 కోట్ల సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ బయటికి వెళ్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా..?