10 తర్వాత ఇంటికే పరిమితమైన జనం
కరోనా కట్టడే లక్ష్యంగా ప్రజల మద్దతు
అంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించిన వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్లో పోలీసు పికెటింగ్ను పరిశీలించి ఎస్పీ నారాయణ
దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
తాండూరు, మే 15: కరోనా కట్టడే లక్ష్యంగా ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. సర్కార్ అమలు చేస్తున్న లాక్డౌన్కు జిల్లా ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తమ పనులు ముగించుకుని లాక్డౌన్ సమయం కాగానే ఇండ్లకే పరిమితమవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంతో తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణం, పల్లెలో వాణిజ్య సంస్థలు, వ్యాపార దుకాణాలు లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా మూసేశారు. నాలుగో రోజైన శనివారం వికారాబాద్ జిల్లాలో లాక్డౌన్ కట్టు దిట్టంగా అమలైంది. ఉదయం పూట జనం కనిపించినా 10 గంటల తర్వాత రోడ్లు పూర్తి నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో ఉపాధి హామీ, వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా జరిగాయి. పోలీసులు పట్టణం, పల్లెల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. అనవసరంగా బయట తిరిగే వాహనదారులకు జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేశారు. వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు కొడంగల్ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించి పోలీసులకు తగు సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ నారాయణ, తాండూరులో అడిషనల్ ఎస్పీ రషీద్ పోలీస్ పికెటింగ్ను పరిశీలించారు. తాండూరు నియోజకవర్గంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలెందర్రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోలింగ్, తనిఖీలు నిర్వహించారు.
పరిగిలో ప్రశాంతంగా..
పరిగి, మే 15 : లాక్డౌన్ 4వ రోజు పరిగిలో ప్రశాంతంగా కొనసాగింది. కొడంగల్ చౌరస్తా, బస్టాండ్, మార్కెట్, గంజ్రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సై క్రాంతికుమార్పాటిల్ ఎప్పటికప్పుడు లాక్డౌన్ సరళిని పర్యవేక్షించారు.