ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ వీడియోల కేసులో అరెస్ట్ తప్పించుకోవడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రూ.25 లక్షల లంచం ఇచ్చాడు. అందుకే అతన్ని ఇన్నాళ్లూ అరెస్ట్ చేయకుండా పోలీసులు ఆగారు అని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోపించారు. ఈ రాకెట్లో ప్రధాన సూత్రధారి అరవింద్ శ్రీవాస్తవ అలియాస్ యశ్ ఠాకూర్ అనే వ్యక్తికి చెందిన సంస్థ గత మార్చిలోనే ఈ విషయాన్ని ఏసీబీకి మెయిల్ ద్వారా చెప్పినట్లు మిడ్డే వెల్లడించింది. గత ఏప్రిల్లో ఏసీబీ దీనిని ముంబై పోలీస్ చీఫ్కు పంపించింది. అయితే ఈ ఆరోపణలపై ముంబై పోలీస్ అధికారులు మాత్రం ఏమీ స్పందించలేదు.
ఈ ఫిర్యాదు చేసింది అరవిండ్ శ్రీవాస్తవకు చెందిన ఫ్లిజ్ మూవీస్. ఇదొక అమెరికా సంస్థ. ఈ కేసులో సంస్థ పేరును చేర్చిన పోలీసులు శ్రీవాస్తవకు చెందిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఆ అకౌంట్లలో రూ.4.5 కోట్ల మొత్తం ఉంది. అంతే మొత్తం ఇవ్వాలని తన సంస్థను కూడా ఓ పోలీస్ ఇన్ఫార్మర్ ద్వారా డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా ఆదేశాలపై చిత్రీకరించిన 70 పోర్న్ వీడియోలపై విచారణ జరుపుతున్నారు.