పంజాబీ సుందరి రాశీఖన్నా తెలుగు, తమిళ చిత్రసీమల్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఏడు సినిమాలు ఉండటం విశేషం. తాజాగా ఈ అమ్మడు తమిళంలో బంపరాఫర్ను సొంతం చేసుకుంది. అగ్ర హీరో ధనుష్ సరసన కథానాయికగా ఎంపికైంది. వివరాల్లోకి వెళితే… ధనుష్ కథానాయకుడిగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ నటిస్తున్న 44వ చిత్రమిది. సన్పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో ఓ కథానాయికగా రాశీఖన్నాను ఎంపిక చేశారు. ప్రకాష్రాజ్, అగ్ర దర్శకుడు భారతీరాజా ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించనున్నారు. ధనుష్తో జోడీగా భారీ సినిమాలో భాగం కావడం పట్ల రాశీఖన్నా సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో ‘థాంక్యూ’ ‘పక్కా కమర్షియల్’ చిత్రాల్లో నటిస్తోంది.