‘విద్య, వైద్యం, విమానయానంతో పాటు అన్ని పబ్లిక్ సెక్టార్లను కేంద్రం ప్రైవేటుపరం చేస్తూ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. రాజ్యంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే దేశ అభివృద్ధి, మనుగడ కోసం అంటూ సాకులు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం వంచిస్తోంది’ అని అన్నారు ఆర్. నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రైతన్న’. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాను ఆదివారం రైతు నాయకులు ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ‘కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టాలు మరణశాసనాలు. ఈ చట్టాలను రద్దు చేయాలని చాటిచెప్పే చిత్రమిది. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ కేంద్రం వాటికి చట్టబద్దత కల్పించిన నాడే రైతు దేశానికి రాజుగా మారతాడు. వ్యవసాయం దండగ కాదు పండుగ అనే రోజు రావాలని ఈ సినిమాలో చూపించాం. కళాకారులను, కళా రంగంతో పాటు యావత్ కళాజాతిని గుర్తించి గౌరవించి గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నా’ అని తెలిపారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ‘నారాయణమూర్తి గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ‘రైతన్న’ ఉంది.
ఆయన పాత్ర ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది.,రైతు చట్టాలు, స్వామినాథన్ కమిటీ లాంటి అంశాలను సెల్యులాయిడ్పై అర్థవంతంగా నారాయణమూర్తి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు చాలా గొప్పపథకం. కేసీఆర్, విజయన్ లాంటి కొందరు నాయకులే రైతులకు మేలు చేస్తున్నారు’ అని అన్నారు. గద్దర్ మాట్లాడుతూ ‘ వరల్డ్ బ్యాంక్, ఐఎమ్ఎఫ్ లాంటి కనిపించని శక్తులు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో ఈ సినిమాలో నారాయణమూర్తి ఆలోచనాత్మకంగా చూపించారు. దేశంలో డబ్బు శాతం ఉన్న రైతుల్ని పట్టించుకోకుండా ఇరవై శాతం ఉన్న పారిశ్రామిక రంగాల్ని బతికించడానికే కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. దోపీడిదారులకు మోదీ ప్రభుత్వం సహకరిస్తోందని టీఆర్ఎస్నాయకుడు శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.