మేడ్చల్ రూరల్, మే 18: రైతుల మేలు కోసమే ప్రభుత్వం కాళేశ్వరం జలాలను సాగుకు అందిస్తుందని అదనపు కలెక్టర్ ఎనుగు నర్సింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావల్కోల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ తవ్వకంతో భూములు కోల్పోతున్న రైతుల వివరాలను వెల్లడించేందుకు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తున్నదన్నారు. ఎవరికైనా పరిహారంలో నష్టం జరిగినట్టు భావిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి తగు న్యాయం చేస్తామన్నారు. గోదావరి జలాల రాకతో రైతులు రెండు పంటలను పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. భూగర్భ జలాలు పెరిగి, బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తాయన్నారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల పేర్లు, కోల్పోతున్న భూమి వివరాలను వెల్లడించారు. గ్రామ సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్ల రాకతో గ్రామ పరిధిలోని వ్యవసాయం సస్యశ్యామలం అవుతుందన్నారు. రైతులందరూ కాల్వల తవ్వకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, తహసీల్దార్ గీత, నీటి పారుల శాఖ అధికారులు , గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.