తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఈయన తీరు భిన్నం.. చేసే సినిమాలు విభిన్నం. తెలుగు సినిమా మేకింగ్ కు సరికొత్త పాఠాలు నేర్పించాడు పూరీ. సినిమా అంటే సంవత్సరాలు చేయడం కాదు 4 నెలల్లో ఫినిష్ చేయడం ఎలా అనేది ఈ తరం దర్శకులకు అర్థమయ్యేలా చేసి చూపించాడు ఈ దర్శకుడు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఎంతో సాధించాడు.. ఎంతో పోగొట్టుకున్నాడు. ఆయన కెరీర్ మొదలు 21 సంవత్సరాలు పూర్తయింది. బద్రి సినిమా విడుదలై ఎప్రిల్ 20, 2021తో 21 ఏళ్లు పూర్తి అయిపోయింది. అంటే మెగాఫోన్ పట్టేసి అప్పుడే 21 ఏళ్లు గడిచిపోయాయి.
ఈ 21 ఏళ్ల కాలంలో ఎన్నో నేర్చుకున్నాడు పూరీ. కెరీర్ మొదట్లోనే బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అప్పు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత లాంటి సినిమాలను అందించాడు పూరీ. ఆ తర్వాత కొంత స్లో అయినా కూడా వెంటనే మళ్లీ టెంపర్ సినిమాతో సత్తా చూపించాడు. బిజినెస్ మ్యాన్ లాంటి సినిమా ఇచ్చాడు. టెంపర్ తర్వాత మళ్లీ వరస ఫ్లాపులిచ్చిన పూరీ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఫ్లాపులు వచ్చినప్పుడు మీకు ఎవరు తోడుగా ఉన్నారని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎవరూ లేరు అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు పూరి.
అదేంటి మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు.. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. నిర్మాతలకు కూడా డబ్బులు తీసుకొచ్చి పెట్టారు కదా.. అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేసారు అంటే ఇక్కడ ఎవరికి జాలి దయ కరుణ ఉండవు.. ఇక్కడ మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయడం ఎప్పుడో మానేశారని చెప్పాడు పూరి జగన్నాథ్. తన విషయంలో కూడా ఇదే జరిగిందని.. ఇండస్ట్రీలో హిట్స్ ఉన్నప్పుడు మాత్రమే విలువ ఉంటుందని చెప్పాడు పూరి జగన్నాథ్. అంతేకాదు ఈయన సంపాదించిన 100 కోట్ల ఆస్తిని కూడా మోసం చేసారు.
జీరో నుంచి మళ్లీ మొదలుపెట్టి పైకి లేచాడు పూరీ జగన్నాథ్. ఇండస్ట్రీలో కృతజ్ఞత అనే మాటే ఉండదని చెప్పాడు ఈ దర్శకుడు. ఉదాహరణకు మహేష్ బాబుని చూపించాడు ఈయన. గతంలో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి రెండు మంచి సినిమాలు మహేష్ బాబుకు ఇచ్చానని కానీ జనగణమన సినిమా విషయంలో ఇప్పటికీ ఆయన కోసం వేచి చూస్తున్నాను అంటున్నాడు ఈ దర్శకుడు. ఇక్కడ కేవలం హిట్స్ ఉన్నప్పుడు మనుషులకు విలువ ఉంటుందని.. ఫ్లాప్ వస్తే కనీసం పట్టించుకోరు అంటున్నాడు. మహేష్ తో సినిమా ఆగిపోవడానికి కూడా తాను పూర్తి ఫామ్ లో లేకపోవడమే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు పూరీ. గతంలో వాళ్లకు ఏం చేశాం ఎంత చేసాం అనేది ఇక్కడ గుర్తుంచుకోరని.. ఆ కృతజ్ఞత అనే మాట అసలు ఇండస్ట్రీలో వినిపించదు అంటున్నాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న పూరీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.