న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కరోనా సంక్షోభం మధ్య మే 2న ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలు, వేడుకలపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతించారు. నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాష్ట్ర యూనిట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంక్షోభంలో అవసరమైన వారికి సహాయపడటానికి బీజేపీ కార్యకర్తలు తమ శక్తిని ఉపయోగిస్తున్నారని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఓట్ల లెక్కింపు సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నియమాలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం స్వీకరించేందుకు ఇద్దరు వ్యక్తులకంటే ఎక్కువ మంది రావొద్దని చెప్పింది. ఇదిలా ఉండగా.. అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా కేంద్ర పాలిత ప్రాంతంలో పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. బెంగాల్ ఎనిమిది విడుత పోలింగ్ జరుగాల్సి ఉండగా.. ఈ నెల 29న ముగియనున్నది. కరోనా వ్యాప్తికి ఎన్నికల కమిషనే కారణమని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.