హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్కు రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని దక్కించుకున్నాడు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తమను రాళ్లతో కొట్టండన్న రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు ఖాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజస్థాన్లో బీఎస్పీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ను కూడా రాళ్లతో కొడుతావా? 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దిగ్విజయ్ సింగ్ ఆహ్వానించారు. ఆయనను కూడా రాళ్లతో కొడుతావా? అని ప్రశ్నించారు. తాము రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్ఎల్పీలో విలీనం అయ్యామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ.. దొంగ రాజకీయాలు చేస్తున్నాడు. తాము ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తున్నామని సుధీర్ రెడ్డి తెలిపారు.
2018 ఎన్నికల్లో తన టికెట్ను అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. చవకబారు రాజకీయాలు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే తమ కార్యకర్తలతో రేవంత్ చెప్పుదెబ్బలు తినడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కుతకుత ఉడికిపోతున్నారని తెలిపారు.