పల్లా గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం
పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుక చేసుకున్న నాయకులు
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నమస్తే నెట్వర్క్ : ‘పల్లా’ గెలుపుపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. శనివారం రాత్రి నుంచే టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఆదివారం అన్ని జిల్లాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. గెలుపు కోసం సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై నమ్మకంతో పట్టభద్రులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవికి పట్టం కట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో వివిధ సంఘాలతో కృతజ్ఞతా సమావేశం ఏర్పాటుచేయగా, పల్లా గెలుపులో భాగస్వాములైన అందరికీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని నాయకులతో కలిసి క్యాంపు ఆఫీస్ నుంచి ర్యాలీ తీసి స్వీట్లు పంచారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని పటాకులు కాల్చారు. ములుగులో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ తీసి పటాకులు కాల్చారు.