న్యూఢిల్లీ, మే 10: దేశంలో విద్యుత్ ఆధారిత కార్ల వినియోగం అంతంతమాత్రంగానే ఉంటుందని, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వృద్ధి కూడా రాబోయే మూడేండ్లలో ఆశించిన స్థాయిలో ఉండబోదని ప్రముఖ ఆటో రంగ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ ఇండియా అధ్యక్షుడు ఎస్ఎస్ కిమ్ అన్నారు. 2024కల్లా భారతీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు దాదాపు 40 లక్షల యూనిట్లకు చేరవచ్చన్న ఆయన ఇందులో విద్యుత్ ఆధారిత వాహనాల వాటా 40వేల లోపే ఉండవచ్చని అంచనా వేశారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, లిథియం-ఇయాన్ బ్యాటరీల ఖర్చు అధికంగా ఉండటం, సింగిల్-చార్జ్ రన్నింగ్ శ్రేణి తదితర ఇతర ముడి ఉత్పత్తులు చౌకగా లభించకపోవడం వంటివి ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ను దెబ్బతీస్తున్నాయన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో హ్యుందాయ్.. ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణికి పెద్దపీట వేస్తుందని కిమ్ చెప్పారు.