‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)లో సమస్యలున్నాయని, మార్పు తీసుకురాగలననే నమ్మకంతో అధ్యక్షబరిలోకి దిగానని చెప్పారు యువ హీరో మంచు విష్ణు. శుక్రవారం హైదరాబాద్లో తన ప్యానెల్తో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ “మా’ అధ్యక్ష పదవి ఒక హోదా కాదు. అదొక గొప్ప బాధ్యత. ఈ సమావేశానికి వచ్చే ముందు నాన్నగారి ఆశీస్సులు తీసుకున్నా. కానీ ఆయన సంతోషంగా లేరు. ఎన్నికలు జరుగుతున్న తీరు, చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరిని కలవరపెడుతున్నాయి. ‘మా’ ఎన్నికలు ఇంత హోరాహోరిగా ఎప్పుడూ జరగలేదు. ఆర్టిస్టుల మధ్య ఈ స్థాయిలో విభజన కూడా ఎప్పుడూ రాలేదు. ‘మా’లో సమూలంగా మార్పు తీసుకురాగలననే నమ్మకం నాలో ఉంది. సవాళ్లను ఎదుర్కొనే సత్తా మా ప్యానల్కు ఉందని నమ్ముతున్నా. నా ప్రత్యర్థి ప్యానెల్లో మంచి నటీనటులున్నారు. నాతో కలిసి పనిచేసినవారు, నా బ్యానర్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా నేను వారిని గౌరవిస్తా కానీ వాళ్లలో ఎవరికి ‘మా’ సంక్షేమం కోసం పాటుపడే సత్తా లేదనుకుంటున్నా. ఇటీవల వాళ్లు చేసిన ప్రసంగాలు విన్నాను. వాళ్లు చెప్పిన విషయాలు 99శాతం ఆమోదయోగ్యంగా లేవు. మా ప్యానెల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులున్నారు. అయితే దయచేసి రాజకీయ పార్టీలను ‘మా’ ఎన్నికల్లో ఇన్వాల్వ్ కావొద్దని కోరుతున్నా. ‘మా’లోని 900 మంది సభ్యులకు జీవిత, ఆరోగ్య బీమా అందించడమే నా తొలి ప్రాధాన్యత. మా’ భవనాన్ని నా సొంత డబ్బులతోనే పూర్తిచేస్తానని మాట ఇస్తున్నా’ అన్నారు.