ముంబై, మే 11: కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపర్చేదిశగా మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటీఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండు పంపిణీ విధానాన్ని తప్పనిసరిగా రూపొందించుకోవాల్సివుంటుంది. మార్కె ట్ విలువ ఆధారంగా టాప్ 500 కంపెనీలకు తప్పనిసరి డివిడెండు పంపిణీ విధానం ప్రస్తుతం అమలులో వుండగా, ఈ సంఖ్యను 1000కు పెంచుతూ తాజా నిబంధనల్ని సెబి సవరించింది. ఇతర లిస్టెడ్ కంపెనీలు వాటి డివిడెండు పంపిణీ విధానాన్ని స్వచ్ఛందంగా వాటి వెబ్సైట్లలో ప్రకటించుకోవొచ్చు. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటును టాప్ 1000 కంపెనీలకు సెబి తప్పనిసరి చేసింది. ఈ కమిటీల్లో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్తో సహా కనీసం ముగ్గురు సభ్యులు వుండాలి. రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించడం, దాని అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం ఈ కమిటీ పని. మార్చి 31నాటి మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ కంపెనీను నిర్ధారిస్తారు.