‘ప్రతి ఒక్కరూ గెలవాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ విజయాల్ని అందుకునేవారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆ జాబితాలో మనం ఉండాలంటే అదృష్టం కలిసిరావాలి’ అని అన్నారు యం. రాజశేఖర్రెడ్డి. శైవం, త్రిపుర లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో అభిరుచి కలిగిన నిర్మాతగా గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. నేడు రాజశేఖర్రెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలపై ఆసక్తితో దర్శకుడినవ్వాలనే సంకల్పంతో చిత్రసీమలోకి వచ్చా. అనుభవం సంపాదించిన తర్వాత మెగాఫోన్ పట్టాలనే ఆలోచనతో తొలుత చిత్రనిర్మాణరంగంపై దృష్టిపెట్టా. స్వీయ అనుభవాలు ఇండస్ట్రీలో ఎలా రాణించాలో నాకు నేర్పించాయి. మంచి కథల్ని ఎన్నుకొని, కష్టపడి సినిమాను రూపొందించి విడుదల చేసే క్రమంలో నిర్మాతలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తుంది. ఆ కష్టాలకు తట్టుకునే పట్టుదల ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో నిలబడతారు. నిర్మాతగా ప్రస్తుతం క్రీడా నేపథ్య కథాంశంతో ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్లతో ‘క్లాప్’ అనే సినిమా చేస్తున్నా. ఆది కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమిది. విజయ్ ఆంటోనీ, అరుణ్విజయ్, అక్షరహాసన్లతో ‘జ్వాల’ అనే ద్విభాషా చిత్రం నిర్మిస్తున్నా. ైక్లెమాక్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’పేరుతో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మరో సినిమా రూపొందిస్తున్నా. ఈ చిత్రంలో విష్వక్సేన్, నివేథా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజిమామోహన్, రెబ్బాజాన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. వీరితో పాటు మరో అగ్రనాయిక నటించనున్నది. ఈ పాత్ర కోసం అమీ జాక్సన్, కీర్తిసురేష్, తమన్నాలలో ఒకరిని తీసుకునే యోచనలో ఉన్నాం. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ ఏడాది నిర్మాతగా పెద్ద విజయాల్ని అందుకుంటాననే నమ్మకముంది’ అని అన్నారు.