‘ప్రస్తుతం భారతీయ సినిమాకు హైదరాబాద్ హబ్గా మారిపోయింది. అన్ని భాషల సినిమా చిత్రీకరణలకు ఈ నగరం వేదికగా మారింది. సినీ పరిశ్రమకు హైదరాబాద్తో విడదీయరాని బంధం ఏర్పడింది’ అని అన్నారు ఎన్వీ ప్రసాద్. పారస్జైన్, వాకాడ అంజన్కుమార్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఇష్క్’ ఈ నెల 30న విడుదలకానుంది. తేజా సజ్జా, ప్రియాప్రకాశ్వారియర్ జంటగా నటించారు. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి…
కంటెంట్ ప్రధానంగా సాగే మంచి సినిమా ఇది. యువతరం మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ నవ్యరీతిలో ఉంటుంది. ఓ ప్రేమజంటకు ఒకరాత్రిలో ఎదురైన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠను పంచుతుంది. వందశాతం విజయాన్ని సాధిస్తుంది. ప్రస్తుతం ప్రజల్లో కొవిడ్ భయాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకముంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాల విడుదలలు ఆగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరో ఒకరు రిస్క్ తీసుకొని ముందుగా సినిమాను విడుదల చేస్తేనే మిగతా ప్రొడ్యూసర్స్కు ధైర్యం వస్తోంది. ఆ రిస్క్ను తొలుత మేము తీసుకున్నాం.
హైదరాబాద్ హబ్గా మారింది
కరోనా మహమ్మారి తర్వాత సినిమాల రూపకల్పనలో ఎలాంటి మార్పులు రాలేదు. పెరిగిన సినిమాల బడ్జెట్లను తగ్గించడం సాధ్యం కాదు. చిత్ర నిర్మాణంలో సీనియర్ ప్రొడ్యూసర్స్ ఓ సిస్టమ్ ప్రకారం నడుచుకుంటున్నారు. కొత్త నిర్మాతల్ని నియంత్రించే అధికారం వారికి లేకపోవడంతో బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సినిమాల విషయంలో భాషాపరమైన హద్దులన్నీ తొలగిపోతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటోంది. గొప్ప కంటెంట్తో సినిమాలొస్తున్నాయి. తెలుగు సినిమాల మార్కెట్ విస్తృతమవడంతో లాభాలు పెరిగాయి. ఇది అందరికీ గర్వకారణంగా మారింది. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ హబ్గా మారడంతో ఎంతో మంది సాంకేతిక నిపుణులు, కార్మికులకు ఉపాధి పెరిగింది. హైదరాబాద్లో చిత్రీకరణలు సజావుగా సాగడానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మా సంస్థలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ రీమేక్ను తెరకెక్కిస్తున్నాం. ఆగస్ట్ 13న ఈ సినిమా ప్రారంభంకాబోతుంది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉంటాయి.