మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్తో కలిసి పల్లెపకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, విద్యుత్ సమస్యల పరిష్కారం, హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ, తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందుతున్నాయని తెలిపారు. అటవీ పునర్జీవన చర్యలో భాగంగా అడవుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. అలాగే నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తే అటవీ శాతం పెరుగుతుందన్నారు.
యాదాద్రి మోడల్ మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం వల్ల ప్రకృతి వనాలు చిట్టడవుల్లా మారుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజానికానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గ్రామాల్లోని పారిశుధ్యంపై సర్పంచ్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఏడో విడుత హరితహారంలో భాగంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. పూర్తైన పల్లె ప్రకృతి వనాలకు చుట్టూరా ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోళి కేరి, తదితరులు పాల్గొన్నారు.