న్యూఢిల్లీ: పాప్ సింగర్ నిక్ జోనాస్ను బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిక్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఆ పరిచయం పెళ్లికి ఎలా దారితీసిందో చెప్పింది ప్రియాంకా. ఓఫ్రా విన్ఫ్రేతో జరిగిన ఇంటర్వ్యూలో నిక్తో జరిగిన తొలి పరిచయ రహస్యాలను వెల్లడించింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పుడు.. వారి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. నిక్కు 20 ఏళ్లు దాటగా.. అప్పటికే ప్రియాంకాకు 35 ఏళ్లు వచ్చాయి. అయితే తొలుత నిక్ తనకు టెక్ట్స్ చేసేవాడని, కానీ దాన్ని తాను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదని ప్రియాంకా చెప్పింది. అయితే అప్పటికే తనకు 35 ఏళ్లు వచ్చేశాయని, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందని, పిల్లలు కూడా కనాలన్న ఆశ ఉందని, కానీ నిక్కు 20 ఏళ్లే.. అయితే తమ మధ్య పరిచయం ఇలా దారి తీస్తుందని అనుకోలేదని ప్రియాంకా అన్నారు.
నిక్ను పర్సనల్గా కలిసిన తర్వాతే తన జీవితం మారినట్లు ప్రియాంకా చెప్పింది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి నిక్ అని, తన ఘనతల పట్ల నిక్ ఎంతో సంతోషించేవాడని, ఏది చేసినా.. ఎంతో ఆనందిస్తాడని, తమ భాగస్వామ్యం నిజమైందని ప్రియాంకా తెలిపింది. తమ పేరెంట్స్ ఎలా గడిపారో అదే విధంగా నిక్తో తాను ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రియాంకా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. తమ తల్లితండ్రులు కూడా ఎంతో ఆప్యాయమైన జీవితాన్ని గడిపారని, వారిని చూసి పెరిగానని, అదే రీతిలో ఇప్పుడు నిక్తోనూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రియంకా పేర్కొన్నది.
2017లో వానిటీ ఫెయిర్ ఆస్కార్స్ పార్టీ సమయంలో నిక్, ప్రియాంకాలు తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వారి మధ్య తొలి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ట్విట్టర్లో ప్రియాంకాను నిక్ ఫాలో అయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఇద్దరూ 2018లో గాలా ఈవెంట్కు హాజరయ్యారు. ఆ ఏడాది డిసెంబర్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.