ఆమని అంటే అచ్చమైన తెలుగింటి గృహిణికి ప్రతిరూపంలా అనిపిస్తుంది. వెండితెరపై కాస్త అమాయకత్వం, గడసరితనం, భర్తపై ప్రేమ పూర్వక ధిక్కార స్వరం వినిపించే సగటు ఇల్లాలిగా ఆమె పాత్రలు కండ్ల ముందు కదలాడుతాయి. సుదీర్ఘమైన కెరీర్లో సకుటుంబ కథాచిత్రాల నాయికగా వెండితెరపై తనదైన సంతకాన్ని లిఖించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యం కలబోసిన పాత్రలతో ప్రతిభను చాటుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జిందగీ’తో ఆమని ముచ్చట్లు..
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయాణం ఎలా అనిపిస్తున్నది?
సినిమాల్లో నాకిది మూడో ఇన్నింగ్స్. పెండ్లి తర్వాత కొన్నేండ్లు సినిమాలకు దూరమయ్యా. ఆ తర్వాత పిల్లల కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నా. దిల్రాజు బ్యానర్తో థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. గీతా ఆర్ట్స్లో వరుసగా మూడు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. నటనకు ఆస్కారమున్న పాత్రలు నన్ను వరిస్తున్నాయి.
‘చావు కబురు చల్లగా’లో తొలిసారి మాస్ పాత్రలో కనిపించారు. ఆ అనుభూతి ఎలా ఉంది?
నా కెరీర్లో ఇప్పటి వరకు చేయని భిన్నమైన పాత్రను ఈ సినిమాలో పోషించా. డీ గ్లామర్ ఛాయలతో దిగువ మధ్యతరగతి మహిళగా కనిపిస్తా.
ఈ పాత్రతో దర్శకుడు మిమ్మల్ని సంప్రదించినప్పుడు చేస్తానో, లేదో అన్న భయాలు మీలో కలిగాయా?
ఆమని మాస్ పాత్రలు చేయగలదా? అనే సంశయాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే సెంటిమెంట్, సంప్రదాయం కలబోతగా కన్నీళ్లు పెట్టే పాత్రల్లోనే నేను అధికంగా కనిపించా. నటిగా నన్ను కొత్తగా చూపించాలనే ఆలోచనతో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ క్యారెక్టర్తో వెతుక్కుంటూ వచ్చారు. అతడి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా.
మాస్ పాత్రలో స్క్రీన్పై మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఏమనిపించింది?
నా సినీ ప్రయాణంలో గ్లామర్తో పోలిస్తే, చీరకట్టుతో ఉండే సంప్రదాయబద్ధమైన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆ పంథాకు భిన్నంగా తెరపై మాస్ సంభాషణలు నేను చెప్పగలనా అనుకున్నా. చిత్రీకరణ సమయంలో మానిటర్లో చూసుకొని ఆశ్చర్యపోయా. ‘నేనేనా ఇలా నటిస్తున్నది?’ అనిపించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్త లాంటి మాస్ క్యారెక్టర్లో కనిపించడానికి చాలామంది ఆర్టిస్టులు వెనుకాడుతుంటారు. నటించిన తర్వాతే ఆ పాత్ర విలువ ఏమిటో అర్థమవుతుంది. ఈ పాత్ర నాకు గొప్ప పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది.
నటిగా మీరు ఆశించిన లక్ష్యాన్ని చేరుకున్నారా?
నటులకు సంతృప్తి అనేది ఉండదు. విలక్షణ పాత్రలు ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలనే కోరిక మనసును వెంటాడుతూనే ఉంటుంది. డబ్బుల కంటే మంచిపాత్రలకు నా తొలి ప్రాధాన్యం. నటనకు ఆస్కారమున్న పాత్రలతో నన్ను నేను నిరూపించుకోవాలనే తపన ఇంకా ఉంది.
నెగెటివ్ రోల్స్ చేయాలనుంది. మెంటల్ డిజార్డర్ క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్నా.
నటిగా మీలో స్ఫూర్తిని నింపిన తారలెవరు?
శ్రీదేవి, జయసుధ, విజయశాంతి, జయప్రదలను నేను ఆరాధిస్తా. వారి సినిమాల్ని చూస్తూ పెరిగా. నటన పరంగా వారే నా రోల్ మోడల్స్. చిరంజీవికి నేను వీరాభిమానిని. ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలో వస్తే వదిలి పెట్టకుండా చూస్తుంటా.
తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఉత్తరాది నటులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు? ఆ పోటీని తట్టుకుంటూ రాణించడం చాలెంజింగ్గా అనిపిస్తున్నదా?
నాలుగైదు ఏండ్లుగా తెలుగు నటీనటులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఉత్తరాది నటులతో పోలిస్తే మన వాళ్లు సంభాషణల్ని చక్కగా పలుకగలరు. సన్నివేశానికి, పాత్రలకు తగినట్లుగా హావభావాల్ని ప్రదర్శిస్తూ పాత్రల్లో ఒదిగిపోగలరనే నమ్మకం దర్శకనిర్మాతల్లో బలపడింది. క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోలిస్తే కథానాయికలు ఎక్కువగా ఉత్తరాదివారే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికలకు నటించే స్కోప్ ఉండటం లేదు. పాటలకే పరిమితమైపోతున్నారు. హీరోయిన్లు గ్లామర్గా కనిపిస్తే చాలనే ధోరణి పెరిగింది. అలాగని వారిని తప్పు పట్టడం లేదు. తమ పాత్రలకు సరిపోతారనే నమ్మకంతోనే ముంబయి నాయికల్ని తీసుకుంటున్నారు.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి సినిమా సెట్స్లోని వాతావరణంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
కార్వాన్ సంస్కృతి వల్ల నటీనటుల మధ్య స్నేహసంబంధాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు షూటింగ్లలో కార్వాన్లు ఉండేవి కాదు. షాట్ గ్యాప్లో అందరం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. ఓ కుటుంబంలా కలిసి పోయేవాళ్లం. సీనియర్స్, జూనియర్స్ అనే భేదాలు కనిపించేవి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ లాంటి వారు తమ నటనానుభవాన్ని అందరితో పంచుకునేవారు. తమ మాటలతో అందరిలో స్ఫూర్తి నింపుతుండేవారు. సినిమా పూర్తయ్యాక కూడా షూటింగ్ తాలూకు మధుర జ్ఞాపకాలు మనసులో నిలిచిపోయేవి. ఇప్పుడు సీన్ పూర్తి కాగానే యాక్టర్స్ కార్వాన్లోకి వెళ్లిపోతున్నారు. సెట్స్లో ఉండాల్సి వచ్చినా సెల్ఫోన్లో మునిగిపోతున్నారు. మాటలు తగ్గిపోయాయి. సినిమా పూర్తయిన తర్వాత ఎవరి పనుల్లో వారుంటున్నారు.
ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
సహ నటుల్లో రోజా, ఇంద్రజ, మీనా మంచి స్నేహితులు. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో అందరూ బిజీ అయ్యారు. మేమంతా కలుసుకోవడం తక్కువే. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం.
డిజిటల్ వరం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ నటీనటులకు వరంలా మారాయి. ఓటీటీల వల్ల నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు, దర్శకులకు జీవనోపాధి పెరిగింది. ఒకప్పుడు సినిమాలు తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. సినిమాల నుంచి తప్పుకొంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేది. సినిమాలు లేకపోతే ఏం చేయాలనే భయాలు ఉండేవి. ముఖ్యంగా నటీనటులకు, ప్రజల్లో ఉన్న ఇమేజ్ కారణంగా నటనను వదిలిపెట్టి వేరే రంగాల్లో రాణించడం కష్టమయ్యేది. ఇప్పుడు ఆ ధోరణిలో మార్పు వచ్చింది. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా వెబ్ సిరీస్, సీరియల్స్లో నటించవచ్చనే ధైర్యం పెరిగింది. ఉపాధి మార్గాలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ మంచి మార్పులేనని భావిస్తున్నా.
సినిమాల తర్వాత నా ప్రాధాన్యం కుటుంబానికే. మా వారు వ్యాపారవేత్త. సినిమాల విషయంలో ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోరు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు ఫస్ట్ క్లాస్. పాప ఎల్కేజీ. ఆయన బిజినెస్, నేను సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పిల్లల బాగోగులు మా అమ్మ చూసుకుంటుంది. ఒక్కోసారి షూటింగ్ల కారణంగా పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందే అన్న బాధ కలుగుతుంది. అప్పుడప్పుడు పిల్లల్ని షూటింగ్కు తీసుకెళ్తుంటా. షూటింగ్లు లేకపోతే ఇంటికే పరిమితమవుతా. కుటుంబ బాధ్యతలు, పిల్లల మంచిచెడులను చూసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. నేను టీవీలో కనిపించగానే పిల్లలు సంతోషపడతారు.
అంతా నా అదృష్టం
కె.విశ్వనాథ్, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి సినిమాలు చేయడం వరంగా భావిస్తున్నాను. నేటి తరంలో ప్రతిభావంతులైన కొత్త దర్శకులు మంచి పాత్రలతో నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నా కోసం ప్రత్యేకంగా పాత్రల్ని సృష్టిస్తున్నారని గొప్పలు చెప్పడం లేదు. కానీ, వారు సిద్ధం చేస్తున్న కథల్లో మంచి పాత్రలు నాకు లభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, గౌరవం వల్లే నేను ఇన్నేండ్లు ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నా. కొన్ని పాత్రలు సంతృప్తినివ్వకపోయినా చేయాల్సివస్తుంది. నచ్చిన పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేం.
సినిమా డెస్క్