కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని వరంగల్ శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. బుధవారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. వరంగల్ శ్రీను మాట్లాడుతూ ‘ఉన్నత నిర్మాణ విలువలతో ఖాకీ, ఖైదీ వంటి సినిమాల్ని తీసిన డ్రీమ్ వారియర్ సంస్థ ఈ సినిమాను అదే స్థాయిలో తెరకెక్కించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం ఖాయంగా కనిపిస్తోంది’ అన్నారు. ‘విభిన్న కథాంశాల్ని ఎంచుకునే విషయంలో నేను నాగార్జునగారిని స్ఫూర్తిగా తీసుకుంటా. ఆయనకు ఓ తమ్ముడిలా ‘వైల్డ్డాగ్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు కాకుండా కౌరవుల వైపు ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. కరోనా వల్ల వచ్చిన ఒత్తిడి ఈ సినిమా చూస్తే పోతుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని కార్తి చెప్పారు. తమిళ చిత్రసీమలో తన తొలి చిత్రమిదని..కాస్త ఒత్తిడిగా ఫీలవుతున్నానని రష్మిక మందన్న తెలిపింది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే చిత్రమవుతుందని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్.ఆర్.ప్రభు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వంశీపైడిపల్లి, సినిమాటోగ్రాఫర్ సత్యన్సూర్యన్ తదితరులు పాల్గొన్నారు.