ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఎంతోమంది అవసరార్థులకు అండగా నిలుస్తోంది అగ్ర కథానాయిక ప్రణీత. ఆహార పదార్థాల సరఫరా మొదలుకొని కరోనా బాధితులకు వైద్యాన్ని అందిస్తూ సహృదయతను చాటుకుంటోంది. ఇటీవలే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సేవా కార్యక్రమాల్ని మరింతగా విస్తరిస్తూనే నటిగా సరికొత్త పాత్రల కోసం సిద్ధమవుతున్నానని చెప్పింది ప్రణీత. ముఖ్యంగా ఓటీటీ వేదికల్లో వినూత్న కథల్ని ఎంచుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఎంతో ఆస్కారం ఉందని వ్యాఖ్యానించింది. ఆమె మాట్లాడుతూ ‘పరిశ్రమలో నాకు మంచి స్నేహితులైన సమంత, కాజల్, తమన్నా వంటి అగ్రతారలు ఓటీటీ వేదికల మీద సత్తాచాటుతున్నారు. డిజిటల్ మాధ్యమాల వల్ల సృజనాత్మక హద్దులు చెదిరిపోయాయి. ఓటీటీ సినిమాలు, సిరీస్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడగలుగుతున్నాం. ప్రధాన స్రవంతి సినిమాలతో పోల్చితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. డిజిటల్ మాధ్యమం భవిష్యత్తులో పాత్రలపరంగా ప్రయోగాలకు వేదికగా నిలుస్తుంది. వెబ్సిరీస్లలో నటించమని నన్ను చాలా మంది సంప్రదిస్తున్నారు. భవిష్యత్తులో డిజిటల్ వేదికల్లో నటించాలనుకుంటున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ప్రణీత బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తోంది.