మనిషికి విటమిన్-డి ఎంత అవసరమో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఈ విటమిన్ అధికంగా ఉన్న రోగుల విషయంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స మంచి ఫలితాలను ఇస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగ నిర్ధారణ సమయంలో.. విటమిన్-డి స్థాయులను పరిశీలించినప్పుడు ఈ విషయం తేలింది. ఈ పరిశోధనను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్లో ప్రస్తావించారు. అమెరికన్లలో ఎక్కువమందికి శరీరానికి సరిపడేంత విటమిన్-డి లేదనీ, ఆ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని వాళ్లు తీసుకోవట్లేదనీ నిపుణులు గుర్తించారు. అందువల్లే విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వాల్సి వస్తున్నదని డాక్టర్లు వాపోతున్నారు. ముఖ్యంగా, పోస్ట్ మెనోపాజ్ మహిళలకు తప్పనిసరిగా ఈ సప్లిమెంట్స్ను సిఫారసు చేయడంపై కూడా చర్చించారు. రక్తంలో విటమిన్-డి ఎక్కువ స్థాయిలో ఉంటే, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ఆస్కారం కూడా తక్కువని గుర్తించారు.