అడవిలోకి ఎవరూ రావద్దని అటవీ శాఖ హెచ్చరిక
సీసీ కెమెరాల్లో చిరుత ఆనవాళ్లు
డిప్యూటీ రేంజర్ వెల్లడి
భయాందోళనలతో రామాయంపేట ప్రాంత గ్రామాలు
రామాయంపేట/ రామాయంపేట రూరల్, ఏప్రిల్ 29 : రామాయంపేట అటవీప్రాంతంలో మళ్లీ చిరుత సంచరిస్తోంది. గత ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిరుత బుధవారం రాత్రి అడవిలో సంచరించగా, అటవీశాఖ సిబ్బందికి సీసీ కెమెరాల్లో చిరుత ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఆనవాళ్లను గుర్తించిన డిప్యూటీ రేంజర్ ఖుత్బొద్దీన్ తొనిగండ్ల, లక్ష్మాపూర్, శమ్నాపూర్ గ్రామాల ప్రజలు అడవిలోకి రావద్దంటూ హెచ్చరిక బోర్డులను పాతారు. గత ఏడాది క్రితం చిరుత అడవిలో సంచరిస్తూ గ్రామ శివారులోకి వచ్చి పశువుల షెడ్లల్లో ఉన్న పశువులను చంపితిన్న సంఘటనలు జరిగాయి. దీంతో సంబంధిత అధికారులు చిరుతను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సీసీ కెమెరాలతో చిరుత ఆనవాళ్లను గుర్తించాం..
సీసీ కెమెరా ఫుటేజీల్లో బుధవారం రాత్రి అడవిలో సంచరిస్తున్న చిరుత ఆనవాళ్లను గుర్తించాం. త్వరలోనే చిరుతను బందిస్తాం. అక్కడి ప్రాంత ప్రజలు అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. చిరుత కనిపించిన వెంటనే సమాచారం తెలియజేయాలి.
డిప్యూటీ రేంజర్ ఖుత్బొద్దీన్