వేంసూరు, మార్చి 29: ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడికతీత, చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చెరువు చుట్టూ ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు ఆక్రమణదారులు చెరువు శిఖం భూములను అక్రమించుకుంటున్నారు. మండలంలోని కందుకూరు, భరిణెపాడు గ్రామాల మధ్య అచ్చెమ్మ చెరువు కింద రైతులు సాగు చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల పేర్లతో సుమారు 20 ఎకరాల భూమిని ఆక్రమించుకుని, ఆ కుటుంబసభ్యుల పేర్లతో రైతుబంధు అందుకుంటున్నారని భరిణెపాడు, కందుకూరు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతు మల్లేపూల నర్సింహారావు తమకు కొన్నేళ్ల క్రితం నుంచే చెరువు శిఖం భూమి ఉందని, దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించానన్నారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా అచ్చెమ్మ చెరువు ఆక్రమణకు గురైందని తన దృష్టికి వచ్చిందని, దానిపై వివరాలు సేకరించి తదుపరి విచారణ చేయనున్నట్లు తెలిపారు.
బొంతు వారి చెరువు ఆక్రమణ
మండలంలోని లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన బొంతు వారి చెరువు శిఖం ఆక్రమణకు గురవుతుందని గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్రోడ్డుకు పక్కనే ఉండడంతో కొందరు చెరువు శిఖం భూమిని ఆక్రమించుకుంటూ ఇళ్ల పట్టాలతో బడ్డీకొట్లు పెట్టుకున్నారన్నారు. దీనిపై రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మట్టి తోలుకుని దుకాణాలు నిర్వహించుకుంటున్నారన్నారు. చెరువుల ఆక్రమణపై రెవెన్యూ, ఐబీ అధికారులు దృష్టి సారించి చెరువులు అక్రమణకు గురి కాకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు.