నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో గత ఏడాదిలో తొలికేసు వెలుగు చూసిన నాటి నుంచి నేటివరకు కొవిడ్ వైద్య సేవలు మరింత విస్త్రతమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర సమీక్షలు జరుపుతుండడంతో ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. కొవిడ్ నిర్దారణతోపాటు తీవ్రతను బట్టి మందులను అందజేస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. హోం ఐసొలేషన్లోనే మెజార్టీ పాజిటివ్ బాధితులు కోలుకున్నారు. జిల్లాలో దాదాపు ఈ ఏడాది కాలంలో 44కేంద్రాల్లో 3.50లక్షల పరీక్షలు నిర్వహించారు. ఇందులో సుమారు 30వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వారంరోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో ఇప్పటివరకు 24,500 మంది వ్యాధిబారి నుంచి కోలుకోగా 90మంది చనిపోయారు. ఇక మరో 5500 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో అందరికీ పరీక్షల్లో పాజిటివ్ రాగానే కొవిడ్ మెడికల్ కిట్స్ను అందజేశారు. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి, శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తితే మినహా మిగతా వారంతా ఇళ్లల్లోనే ఉండి సురక్షితంగా కొవిడ్ జయించారు. ఇందులో ప్రభుత్వ వైద్యసేవల పాత్రనే కీలకమనేది కాదనలేని సత్యం. ప్రస్తుతం కూడా జిల్లాలో నిత్యం మూడు వేల పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉండడాన్ని బట్టి పరీక్షలు కొనసాగిస్తున్నారు.
కొవిడ్ బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక వైద్యసేవలతోపాటు ఆక్సిజన్, రెమ్డెసివిర్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది హోం ఐసొలేషన్లోనే కోలుకుంటున్నారు. అతి కొద్దిమందికి మాత్రమే అత్యవసర సేవలు అవసరమవుతున్నాయి. ప్రభుత్వపరంగా అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. – డీఎంహెచ్ఓ కొండల్రావు