నడిగూడెం, జూన్ 25 : రైతుల అభ్యున్నతికే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు అన్నారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని కరివిరాల, సిరిపురం, రత్నవరం గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికలతో వ్యవసాయరంగం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. నాటి పాలకులు దండుగ అన్న వ్యవసాయాన్ని ఆరేండ్లలో సీఎం కేసీఆర్ పండుగలా మార్చారని అన్నారు. గోదావరి జలాలతో బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు. రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసి లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు షేక్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, జిల్లా వ్యవసాయాధికారి రామారావు, ఏడీఏ వాసు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొల్లు రామారావు, వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, పాలడుగు ప్రసాద్, దేవబత్తిని సురేశ్, బడేటి చంద్రయ్య, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.