సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామశివారులో ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున నిప్పంటించడంతో రూ. 45వేల నష్టం వాటిల్లింది.
బాధితుడు కురుమ నాగ్గొండ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నపంట ఎండిపోవడంతో కోతకోసి కుప్పవేశామన్నారు. మరుసటి రోజు నూర్పిడి చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు ఆయన తెలిపారు. సుమారు 15 క్వింటాళ్ల వరకు జొన్నపంట దిగుబడి వచ్చేదన్నారు.
ఈవిషయాన్ని కంగ్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అబ్దుల్ రఫీక్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.