టర్కీ బాక్సింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ ఏంటో రుచిచూపించింది. బరిలోకి దిగితే పతకం పక్కా అన్న రీతిలో ప్రత్యర్థులకు సవాలు విసురుతూ దూసుకెళుతున్నది. ఇస్తాంబుల్(టర్కీ) వేదికగా జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల 51కిలోల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5-0 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్ ఎక్టరీనా పట్సెవా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ ఇందూరు అమ్మాయి పంచ్ పవర్తో ప్రత్యర్థిని పడగొట్టింది. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా క్లీన్ పంచ్లతో చెలరేగిన జరీన్ సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది. మరోవైపు కామన్వెల్త్ స్వర్ణ విజేత గౌరవ్ సోలంకి, సోనియా లాథర్ విజయాలతో టోర్నీలో ముందంజ వేశారు. నమన్ తన్వర్, పీఎల్ ప్రసాద్, ప్రయాగ్ చౌహాన్, పూజ ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగారు.