న్యూఢిల్లీ: ఓవైపు ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇండియాలో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్ వృథా అవుతోంది. ఇప్పటి వరకూ ఒకటి రెండు కాదు ఏకంగా 23 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయి.
ఎందుకీ పరిస్థితి?
ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేసింది. అందులో గురువారం వరకు 3.46 కోట్ల డోసులను లబ్ధిదారులకు ఇచ్చారు. ఇక మొత్తంగా చూస్తే 6.5 శాతం వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయి. వీటి సంఖ్య 23 లక్షలకుపైనే కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణంగా ఓ వ్యాక్సిన్ సీసా తెరిచిన తర్వాత అందులోని మొత్తం వ్యాక్సిన్ను 4 గంటలలోపే ఇచ్చేయాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ టీకా ఒక సీసాను పది మందికి, కొవాగ్జిన్ టీకా ఒక సీసాను 20 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సీసాలను తెరిచిన తర్వాత గడువులోపు తగినంత మంది లబ్ధిదారులు రాకపోవడం వల్ల అది కాస్తా వృథా అయిపోతోంది. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ అంటే విముఖంగా ఉండటం ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక ఒక్కో వ్యక్తికి 0.5 మి.లీ. వ్యాక్సిన్ ఇస్తారు. దీనిని ఒక డోసుగా పరిగణిస్తారు. ఇలా ఒక్కో డోసును ఒక్కో సీసాలో నింపి, రవాణా చేయడం చాలా కష్టం. దీంతో పది, ఇరవై మందికి వచ్చేలా ఒక్కో సీసాను తయారీ సంస్థలు నింపుతున్నాయి.
వ్యాక్సినేషన్ వేగం పెంచితేనే..
ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న రెండో దేశంగా ఇండియా ఉంది. అయినా ఈ స్థాయిలో వ్యాక్సిన్ డోసుల వృథా ఆందోళన కలిగిస్తోంది. అందుకే మొన్న ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా కూడా ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వృథాను అరికట్టాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్కు కిలోమీటర్ పరిధిలో అర్హత ఉన్న లబ్ధిదారులకు ఫోన్ చేసి పిలవాలని, కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందు వ్యాక్సిన్లు ఇవ్వడం సరైన వ్యూహం అవుతుందని ప్రజారోగ్య నిపుణుడు దిలీప్ మావ్లాంకర్ అభిప్రాయపడ్డారు. కేవలం వృద్ధులకే కాకుండా అర్హత వయసును తగ్గించడం ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ చేర్చడం ద్వారా కూడా వృథాను అరికట్టవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.