ఢిల్లీలో ‘త్రూ ద ఐస్’ పేరుతో ఇటీవల ఫొటోగ్రాఫర్ ఆండీ మల్హన్ తన మాతృమూర్తి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నది. ‘మా అమ్మ పేరు ఉష. డెమెన్షియా బాధితురాలు. ఈ రుగ్మత మా అమ్మకే పరిమితం కాలేదు. మా కుటుంబ సమస్య కూడా కాదు.
జనమంతా తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి’ అంటారాయన. ప్రజల్లో డెమెన్షియా పట్ల అవగాహన పెంచడానికి తన తల్లినే ఉదాహరణగా ఎంచుకున్నారు మల్హన్. ఆ మతిమరుపు వ్యాధి కారణంగా ఆమె జీవితంలో వచ్చిన మార్పులను తన కెమెరాలో బంధించారు. వాటినే ఇప్పుడు ప్రదర్శనకు ఉంచారు. డెమెన్షియా జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధి. రోగి క్రమంగా ఆలోచనాశక్తిని కోల్పోతారు. పాత విషయాలేవీ గుర్తుండవు. దేశంలో 40 లక్షల మంది డెమెన్షియా బాధితులున్నారు.