సర్వం సిద్ధం చేసిన అధికారులు
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక ఏర్పాట్లు
చేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక
14 వరుసల సీటింగ్, వరుసకు ఆరుగురు సభ్యులు
వీడియో కాల్ ద్వారా కరోనా బాధితుల ఓటింగ్
పీపీఈ కిట్లతో కొవిడ్ సోకిన కార్పొరేటర్ల ఇంటికి సిబ్బంది
పరిశీలకుడు కిషన్, కలెక్టర్ హన్మంతు పర్యవేక్షణ
వరంగల్, మే, 6 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి కిషన్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇండోర్ స్టేడియం ముందు భాగంలో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. రాజకీయ పార్టీల వారికి, స్వతంత్రులకు వేర్వేరు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సభ్యుడికి ఫేస్ షీల్డ్, మాస్కు, శానిటైజర్ అందించనున్నారు. ఈ మేరకు సర్క్యూట్ గెస్ట్ హౌస్లో పరిశీలకులు కిషన్, కలెక్టర్ హన్మంతు, ఆదనపు కలెక్టర్ సంధ్యారాణి ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు 66 మంది కార్పొరేటర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత చేతులు ఎత్తడం ద్వారా మేయర్ను, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. కార్యక్రమం 30 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బల్దియా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండోర్ స్టేడియం అవరణలో పెద్ద షామియానా వేశారు. వేదికను సిద్ధం చేయడంతో పాటు, కూలర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుడు, కలెక్టర్, అదనపు కలెక్టర్తో పాటు బల్దియా కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ పుష్ప, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, ఈఈ శ్రీనివాసరావు, ఏసీపీలు గిరి, సత్యనారాయణ, బల్దియా డీఈ, ఏఈ తదితరులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా బారిన పడినా..
కరోనా బారిన పడిన సభ్యులు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. 66 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 72 మంది ప్రక్రియలో పాల్గొంటారు. కరోనా బారిన పడిన కార్పొరేటర్ల ఇంటికి సిబ్బంది పీపీఈ కిట్లతో వెళ్లనున్నారు. వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వేదిక వద్ద ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 8మంది సభ్యులు కరోనా బారిన పడగా ప్రత్యేకంగా సిబ్బందిని పీపీఈ కిట్లతో వారి ఇంటికి పంపించనున్నారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు వీరే
గ్రేటర్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఆరుగురు ఉన్నారు. కొత్త పాలక వర్గం కొలువుదీరనున్న తరుణంలో బల్దియా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ప్రజాప్రతినిధులు ముందస్తుగా ఏ ఫారం ఇవ్వాలి. ఎక్స్ అఫీషియోలుగా ఉండేందుకు ఆరుగురు ప్రజాప్రతినిధులు అంగీకార పత్రాలిచ్చారు. వీరిలో వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నారు.
నిష్పక్షపాతంగా మేయర్ ఎన్నిక :అదనపు కలెక్టర్ సంధ్యారాణి
కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి, ఆదనపు కలెక్టర్ సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేవశంలో ఎన్నికపై సిబ్బందికి అవగాహన కల్పించారు. వివాదాలకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో బల్దియా ఇన్చార్జి కమిషనర్ సత్యనారాయణ, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, సూపరిటెండెంట్లు జాకీర్ హుస్సేన్, షహజాదీ బేగం, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శ్యామ్రాజ్ పాల్గొన్నారు.