సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వర్తింపు
కరోనా సెకండ్వేవ్ ప్రభావంతో గడచిన మూడునెలలుగా మూతపడివున్న థియేటర్లు త్వరలో పునఃప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ వల్ల కలిగిన నష్టాల నుంచి తమను ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గతవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి కొన్ని సమస్యల్ని విన్నవించారు. అందులో రద్దు చేసిన పార్కింగ్ ఫీజును తిరిగి వసూలు చేసుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యాలకు ఊరట కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తూ పార్కింగ్ ఫీజుల వసూలుకు అనుమతినిచ్చింది. 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది. అయితే ఈ జీవో కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మల్టీఫ్లెక్స్ థియేటర్లతో పాటు ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.
సింగిల్స్క్రీన్స్ల్లో పార్కింగ్ ఫీజు అనేది ముఖ్య ఆదాయ వనరు. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం కల్పించడం వల్ల ప్రత్యక్షంగా కొంత మందికి ఉపాధి కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వీటితో పాటు ప్రభుత్వానికి మేము విన్నవించిన మరికొన్ని సమస్యలపై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం
అభిషేక్ నామా, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత
సింగిల్స్క్రీన్ థియేటర్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే వీలుగా ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మా ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సింగిల్స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకమైన ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఎగ్జిబిటర్లకు కొంత ఊరట కలిగించింది.
సునీల్ నారంగ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరి, పంపిణీదారుడు, నిర్మాత