న్యూఢిల్లీ: పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్-12’ విజేతగా పవన్దీప్ రాజన్ నిలిచారు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించే ఇండియన్ ఐడల్ సీజన్ 12 గతేడాది నవంబర్లో ప్రారంమైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించారు. ఆరుగురు ఫైనలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సింగింగ్ రియాలిటీ షోలో ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. తొలి రన్నరప్గా అరుణిత కంజిలాల్, సేలీ కంబ్లే, దానిష్ మహ్మద్, నిహల్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నది. విజేత పవన్దీప్కు ఇండియన్ ఐడల్ ట్రోఫీతోపాటు కారు, రూ.25 లక్షల నగదు అందజేశారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే అర్ధరాత్రి వరకు సాగింది. ఇందులో సేలీ కంబ్లే, అరుణిత కంజిలాల్, నిహాల్ తౌరో, పవన్దీప్ రాజన్, దానిష్ మహ్మద్, షణ్ముఖ ప్రియ తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే చివరికి అత్యుత్తమ ప్రదర్శన చేసిన పవన్దీప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఆదిత్య నారాయణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో హిమేశ్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.