హైదరాబాద్ : శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో లిబియా నుంచి ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. భారత్ నిషేధించిన దేశం నుంచి నిబంధనలు ఉల్లంఘించి ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ వ్యాపారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన సయ్యద్ హజీ ఇస్మాయిల్ గత 2017లో హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లి.. అక్కడి నుంచి వ్యాపారం కోసం లిబియాకు వెళ్లాడు.
అక్కడే కొంతకాలం వ్యాపారం చేసిన అతను భారత్కు రావాలని నిర్ణయించుకున్నాడు. లిబియా నుంచి దుబాయి మీదుగా మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా సయ్యద్ హజీ ఇస్మాయిల్ పాస్పోర్టును తనిఖీ చేసిన అధికారులు లిబియా నుంచి వచ్చినట్లు గుర్తించి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు పోలీసులు తెలిపారు.
2014లో లిబియా రాజధాని ట్రిపోలీ అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసమైంది. ఈ క్రమంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత పౌరులు ఆ దేశం వెళ్లకుండా ప్రభుత్వం 2015లో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. 2016, మేలో ప్రభుత్వం ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్తిగా నిషేధం విధించింది. అప్పటి నుంచి ఆ దేశానికి భారత్ నుంచి వాణిజ్య విమానాలు నడువడం లేదు.