హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండి సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగు అవుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టియస్ ఐపాస్ చట్టప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది.
అనంతరం కంపెనీ ప్రతినిధి బృందం కైటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్కు వివరించింది. తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఆసక్తి/ప్రతిపాదన పట్ల స్పందించిన తీరు పైన ప్రశంసలు కురిపించింది. ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం చాలా అరుదంది. ఇక్కడి ప్రభుత్వ విధానాలు, టెక్స్టైల్ పరిశ్రమకు ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టి అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపింది.
తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రతినిధి బృందం సందర్శించింది. ప్రతినిధి బృందంతో టీఎస్ఎస్ఐఐ సీఎండీ నరసింహా రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ఇంత భారీ ఎత్తున దేశంలో ఎక్కడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదని కంపెనీ అభిప్రాయపడింది.