బెడ్షీట్స్ తయారీకి కేరాఫ్ సిరిపురం, వెల్లంకి
రఘునాథపురం లుంగీలకు గల్ఫ్దేశాల్లో యమ క్రేజీ
జాతీయ పురస్కారాలతో విశ్వవ్యాప్తం అయిన చేనేత ఖ్యాతి
తెలంగాణ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల చీరలు ఉన్నప్పటికీ వస్త్రశ్రేణిలో పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. దేశంలో పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటి కాగా..రెండు దశాబ్దాల కిందట టై అండ్ డైలో అంతర్జాతీయ స్థాయిలో మొదటి పేటెంట్ హక్కును సాధించింది. ప్రపంచం నలుదిశలా వ్యాపించిన పోచంపల్లి కళా ప్రతిభ..కేవలం పోచంపల్లికే పరిమితం కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు విస్తరించడంతోపాటు వేలమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. సిల్క్, కాటన్, పట్టు ఫ్యాబ్రిక్లో లభ్యమయ్యే ఇక్కత్ వస్ర్తాలు, మెటీరియల్స్ అందంగా..హుందాగా కనిపించేలా సరికొత్త రంగులతో కాంతులీనుతున్నాయి. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్, లుంగీలు, గృహోపయోగ వస్ర్తాలు..ఇలా ఇక్కత్ ఫ్యామిలీలో ఉన్న బోలెడన్ని వెరైటీలు దేశ, విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పన రంగమైన చేనేత- జౌళికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నివ్వడంతో.. ప్రతి సంవత్సరం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే రూ.100 నుంచి రూ.120కోట్ల వ్యాపారం జరుగుతోంది.
యాదాద్రి భువనగిరి, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోచంపల్లి చేనేతది వందేళ్ల చరిత్ర. నిజాం కాలంలోనే రుమాళ్లను చెట్లు, పూల నుంచి తీసే రంగులతో సహజ సిద్ధంగా తయారు చేసి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. 1970 సంవత్సరం నుంచి పట్టు చీరలను నేస్తుండగా.. అరవైయేళ్ల కిందటే టై అండ్ డై పద్ధతిలో మగ్గాల మీద నేసేవారు. ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పిలవబడే పోచంపల్లి చేనేతలో కాటన్, పట్టు, సికో వస్ర్తాలకు ప్రసిద్ధి. వీటిలో ఇక్కత్ పట్టు చీరలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో చీర ధర రెండు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి విచ్చేసిన మహిళలు కూడా పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన చీరలంటే మక్కువ చూపిస్తారు. ఇందిరాగాంధీ, ప్రతిభాపాటిల్ వంటి ప్రముఖులు పోచంపల్లి చీరలను కట్టినవాళ్లే. అమెరికా అధ్యక్ష భవనం, బ్రిటన్ శాసనసభ అలంకరణ కోసం పోచంపల్లి వస్ర్తాలను ఉపయోగించడం..పోచంపల్లి డిజైన్కు ఉన్న ఘనతను తెలియజేస్తుంది. ఒకప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే వస్ర్తాలు తయారవ్వగా.. ఇప్పుడు అన్ని రంగుల్లోనూ నేస్తున్నారు.
దేశ, విదేశాలకు ఎగుమతి
అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించిన పోచంపల్లి వస్ర్తాలు, డిజైన్లపై దేశ విదేశాల్లో మగువలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయపరంగానే కాకుండా.. మారుతున్న అభిరుచులకి.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేనేత కళాకారులు తమ కళను, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోచంపల్లి వస్ర్తాలు, డిజైన్లకు దేశ విదేశాల్లో ఉన్న క్రేజ్ ఎక్కువే. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడ తయారైన వస్ర్తాలు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలోని సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్ బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్కు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. రాజాపేట మండలంలోని రఘునాథపురంలో తయారవుతున్న లుంగీలు ముంబయి, సూరత్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులు ఆన్లైన్ వేదికగా నేరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. యువత కూడా చేనేత వ్యాపారంలోకి అడుగిడేందుకు ఆసక్తి చూపుతుండగా.. వాట్సప్, ఫేస్బుక్తో పాటు ప్రత్యేక వెబ్సైట్లను ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే ప్రతి యేటా సిల్క్ రంగంలో రూ.70 – రూ.80 కోట్ల వ్యాపారం, కాటన్ రంగంలో రూ.30-రూ.40 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వేలాది మందికి ఉపాధి
జిల్లాలోని భూదాన్ పోచంపల్లితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, చండూరు, మోత్కూరు, రాజాపేట, ఆలేరు, గుండాల, నాగారం, బోగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు చేనేత వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి. ఇక్కత్ వస్ర్తాలకు ప్రసిద్ధిగాంచిన యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 3,200 వరకు మగ్గాలు ఉండగా.. 5,900 మంది జియోట్యాగింగ్లో నమోదయ్యారు. మరో 15వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షతకు గురైన చేనేత రంగానికి స్వరాష్ట్రంలో పూర్వవైభవం వచ్చింది. ఐటీ, చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి వివిధ పథకాల ద్వారా చేనేత కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే గత యేడాది లాక్డౌన్ సందర్భంగా కార్మికుల దీనస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆగస్టులో ‘చేనేతకు చేయూత’ కార్యక్రమంలో భాగంగా ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రూ.33కోట్లను కార్మికుల ఖాతాల్లో జమచేయించారు. అలాగే ‘చేనేత మిత్ర పథకం’లో భాగంగా నూలు కొనుగోలు చేసిన కార్మికులకు గడచిన రెండేండ్లకాలంలో రూ.3.86కోట్ల సబ్సిడీని అందించారు. చేనేత వస్ర్తాలను ధరించాలని ఎన్నో వేదికలపై పిలుపునివ్వడంతో చేనేత వస్ర్తాలను ధరించే వారి సంఖ్య గతంలోకంటే గణనీయంగా పెరిగింది.
జాతీయ పురస్కారాలతో చేనేత ఖ్యాతి విశ్వవ్యాప్తం
అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కొందరు కార్మికులు వస్ర్తాల తయారీలో తమకంటూ ప్రత్యేకతను చాటి అవార్డులను సొంతం చేసుకుని చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేశారు. నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం అంజయ్య 2012లో పద్మశ్రీ అవార్డుతోపాటు జాతీయ హస్తకళ, శిల్పగురు పురస్కారాలను అందుకోగా..ఇదే గ్రామానికి చెందిన మరో చేనేత కళాకారుడు గజం గోవర్ధన్ పద్మశ్రీఅవార్డును, మాస్టర్ వీవర్ అవార్డును, యునెస్కో సిల్క్ ఎక్స్లెన్సీ, శిల్పగురు అవార్డులను అందుకున్నారు. గజం రాములుకు విశ్వకర్మ పురస్కారం, జాతీయ హస్తకళ పురస్కారం, యునెస్కో అవార్డులు వరించాయి. ఆనందం నాగరాజు, పిల్లలమర్రి రాధాకృష్ణ మూర్తి, కొలను బుచ్చి రాములు, గజం యాదగిరి, గూడ శ్రీనివాస్, ఆనందం నాగరాజు, పున్న కృష్ణ, గజం శ్రీనివాస్, చెరుపల్లి భావనరుషి, గజం ముత్యాలు, జెల్లా వెంకటేశం, గజం భద్రయ్యకు జాతీయ హస్తకళ పురస్కారాలు లభించాయి.
చేనేతల ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వంలో చేనేత రంగం పురోగమనంలో పయనిస్తున్నది. ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ అమలు చేసి ఆదుకుంటున్నరు. చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచి, గౌరవం కల్పించే రీతిలో కార్యక్రమాలను అమలు చేస్తుండడం శుభ పరిణామం. ప్రభుత్వ అధికారులతోపాటు ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించాలని చెప్పడం వల్ల చేనేత రంగం తల రాత మారుతున్నది.
ఎంబీఏ చదువుతూనే చేనేత రంగంలోకి వచ్చా
డిగ్రీ పూర్తయ్యాక ఎంబీఏ చదవాలని నిర్ణయించుకున్న. ఫస్ట్ సెమిస్టర్ కూడా పూర్తయ్యింది. లాక్డౌన్లో చదువును కొనసాగించడం కష్టమనిపించి ఊర్లో నాన్న కొనసాగిస్తున్న చేనేత వస్ర్తాల వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని భావించాను. కాటన్ బెడ్షీట్స్ తయారీకి సిరిపురం ప్రసిద్ధి. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. ఈ రంగంలో మరి కొంతమందికి ఉపాధి చూపుతున్నందుకు సంతృప్తిగా ఉంది.