చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తరపోరు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరుజట్లు మొత్తం 28 మ్యాచ్ల్లో తలపడగా ఢిల్లీ 12 గెలువగా, ముంబై 16 మ్యాచ్ల్లో నెగ్గింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు బుమ్రా బౌలింగ్తో పెను ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే లీగ్లో ఇప్పటి వరకు బుమ్రా బౌలింగ్లో 33 బంతుల్లో 5సార్లు ఔటయ్యాడు. ఐపీఎల్లో ముంబైపై శిఖర్ ధావన్కు మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై 39.36 సగటుతో 24 ఇన్నింగ్స్ల్లో 748 పరుగులు చేశాడు.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెపాక్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందుతుండటంతో రోహిత్ తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. ఆడమ్ మిల్నే స్థానంలో ఆఫ్స్పిన్నర్ జయంత్ యాదవ్ను తీసుకున్నట్లు రోహిత్ చెప్పాడు. హెట్మైర్, అమిత్ మిశ్రాలను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ సారథి రిషబ్ పంత్ తెలిపాడు.