సుమారు రూ. 5 కోట్లతో నిర్మాణం అంచనా
మొదటి విడతగా రూ. కోటి కేటాయింపు
ఆధునిక హంగులతో బస్స్టాండ్ నిర్మాణం
బస్స్టాండ్ నిర్మాణం పై ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
దుబ్బాక టౌన్, మార్చి 31 : దుబ్బాక బస్స్టాండ్కు మహర్దశ సంతరించుకోనుంది. ప్రయాణికులకు సకల సౌకర్యాలు, అన్ని హంగులతో బస్స్టాండ్ను నిర్మించనున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా అధునాతన రీతిలో నిర్మించి ప్రయాణికులకు సేవలందించేందుకు తొలి అడుగుపడింది. పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పోతుండడంతో ప్రయాణికులకు ప్రాణహాని ఉందని ఇటీవల తనిఖీలో గ్రహించిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఇటీవల దుబ్బాక బస్స్టాండ్ను నూతనంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి హరీశ్రావు సహకారంతో దుబ్బాక బస్స్టాండ్ స్థితిగతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో పరిస్థితిని గమనించిన వెంటనే సీఎం కేసీఆర్ నూతన బస్స్టాండ్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోనే అత్యాధునిక హంగులతో బస్స్టాండ్ను నిర్మించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన బస్స్టాండ్ స్థానంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా మొదటి విడుతగా కోటి రూపాయలను కేటాయిస్తూ ఆర్టీసీ ఎండీ. సునీల్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 40 ఏండ్ల క్రితం నిర్మించిన దుబ్బాక బస్స్టాండ్ స్థానంలో మోడల్ బస్స్టాండ్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా, మంగళవారం సంబంధిత అధికారులు బస్స్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
శిథిలావస్థకు చేరిన బస్స్టాండ్…
నాలుగు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న దుబ్బాక బస్స్టాండ్ను 1983లో అప్పటి రవాణా శాఖ మంత్రి ఎస్. సత్యనారాయణ ప్రారంభించారు. సుమారు 40 ఏండ్ల పాటు సేవలందించి నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు పెచ్చులూడి మీద పడతాయోనన్న భయాందోళనతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఓ వైపు పై నుంచి వర్షపు నీరు కారటం, మరో వైపు పెచ్చులూడి ఎప్పుడు ఏ ప్రయాణికుడి మీద పడుతుందోన్న భయంతో ప్రస్తుత బస్స్టాండ్ ఉంది. ప్రయాణికులు బస్స్టాండ్లో కూర్చోకుండా చూసేందుకు సిబ్బందిని కేటాయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ప్రమాదాల నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. బస్స్టాండ్లో షాపులు, హోటళ్ల నిర్వహణ ప్రమాదకరంగా మారింది.
అధునాతన హంగులతో…
దుబ్బాక బస్స్టాండ్ను అధునాతన హంగులతో నిర్మించేందుకు ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బస్స్టాండ్ ఉన్న ఒక ఎకరా 5 గుంటల స్థలంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా అధునాతన హంగులు, సకల సౌకర్యాలు, పార్కింగ్, టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు నమూనాను సిద్ధం చేయిస్తున్నారు. సరిహద్దు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్స్టాండ్ ద్వారా రాకపోకలు సాగిస్తుండటంతో దుబ్బాక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడే ఈ బస్స్టాండ్ నిర్మాణం ఎంతో కీలకం కానుంది. దుబ్బాక బస్స్టాండ్ నిర్మాణంపై ఎంపీ ప్రభాకర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు.
మోడల్ బస్స్టాండ్ను నిర్మించాలన్నదే ధ్యేయం
దుబ్బాకలో శిథిలావస్థకు చేరుకున్న బస్స్టాండ్ స్థానంలో నూతనంగా మోడల్ బస్స్టాండ్ను నిర్మించాలన్నదే ధ్యేయం. ప్రస్తుతం కోటి రూపాయలు మంజూరయ్యాయి. మరో 5 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ ద్వారా మంజూరు చేయించుకొని జిల్లాలోనే మోడల్ బస్స్టాండ్గా నిర్మించ తలపెట్టాం. ఇప్పటికే బస్స్టాండ్ నిర్మాణం కోసం ఆర్కిటెక్చర్ పనులను పూర్తి చేశాం. సెల్లార్, పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. దుబ్బాక బస్స్టాండ్కు ఇరువైపులా రోడ్లు రావడంతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. వచ్చే కొద్ది నెలల్లోనే నూతన బస్స్టాండ్ను దుబ్బాక ప్రాంత ప్రజలకు కానుకగా ఇవ్వనున్నాం.
ఇవి కూడా చుడండి
హైదరాబాద్-హుబ్లీ విమాన సర్వీసులు పున:ప్రారంభం
ఏపీ నుండి తెలంగాణ ఉద్యోగుల రిలీవ్