ముస్తాబైన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం
కరోనా నేపథ్యంలో బేడా మండపంలోనే కల్యాణ వేదిక
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం..
హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
రేపు పట్టాభిషేకం
భద్రాచలం, ఏప్రిల్ 20: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ నవాహ్నిక మహోత్సవాల్లో భాగంగా బుధవారం జగదభిరాముడి కల్యాణం జరుగనుంది. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ అనీల్కుమార్ భక్తులకు సూచించారు.
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠరామునికి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను (స్వర్ణ మూర్తులను) రామదాసు చేయించిన దివ్యాభరణాలతో అందంగా అలంకరించి ఆలయ ప్రాం గణంలోని బేడా మండపం వద్దకు తోడ్కోని వచ్చారు. సీతారాములను అభిముఖంగా ఆశీనులను చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. ఈ ఉత్సవంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనీల్కుమార్ దంపతులు, దేవస్థానం ఈఓ శివాజీ దంపతులు, ఏఈఓ శ్రావణ్కుమార్, ఈఓ సీసీ అనిల్కుమార్, డీఈ రవీందర్రాజు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, అర్చక, వైదిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాలలో నిరాడంబరంగా..
పర్ణశాల: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో బుధవారం జరుగనున్న సీతారాముల కల్యాణం కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోనే నిరాడంబరంగా చేస్తున్న ట్లు ఆలయ అధికారులు తెలిపారు. మం గళవారం ఆలయంలో స్వామివారి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా అష్టమి నేపథ్యం లో యాగశాల పూజ, శతుస్నానార్చనం పూజా కార్యక్రమాలు నిర్వహించి రాత్రి గరుఢవాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవా న్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
కరోనా నిబంధనలతో..
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేకం, కల్యాణ మహోత్సవాలను తిలకించేందుకు మంగళవారం వచ్చిన ఆయన.. స్థానిక అల్లూరి నిలయంలో బస చేశారు. మంత్రికి ఆలయ ఈవో శివాజీ, సీఎఫ్వో భీమా, డీఎఫ్వో బాబు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ప్రచార రథం ప్రారంభం
దేవస్థానం తయారు చేయించిన ప్రచార రథాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.