‘దొరసాని’ చిత్రంలో అందం, అమాయకత్వం కలబోసిన నాయికగా యువతరం హృదయాల్ని దోచుకుంది శివాత్మిక రాజశేఖర్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకుడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. గురువారం కథానాయిక శివాత్మిక జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్లుక్ను అడివి శేష్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశించే పంచేంద్రియాల చుట్ట్టు అల్లుకున్న కథ ఇది. ఐదు ఇంద్రియాల నుంచి వ్యక్తమయ్యే భావోద్వేగాలతో సాగుతుంది. నేటి యువతరం ఆలోచనలు, దృక్పథాలకు అద్దం పడుతుంది. ఈ సినిమాలో లేఖ పాత్రలో శివాత్మిక కనిపిస్తుంది. అభినయానికి ఎంతో ఆస్కారమున్న పాత్ర అమెది’ అన్నారు. లేఖ పాత్ర తనకెంతో ప్రత్యేకమని శివాత్మిక చెప్పింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె నల్లి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, మాటలు: హర్ష పులిపాక, సందీప్రాజ్, రచన, దర్శకత్వం: హర్ష పులిపాక.