మేధావుల సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదిస్తాం
రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్
దళితుల్లో పేదరిక నిర్మూలనకు సీఎం కృషి: ఎమ్మెల్సీ పల్లా
మామాళ్లగూడెం, జూలై 1: దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీనిలో భాగంగానే దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. దళిత సాధికారత పథకం అమలుకు వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులతో గురువారం సాయంత్రం టీటీడీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కలెక్టర్ కర్ణన్తో కలిసి చర్చించారు. సలహాలు, సూచనలు స్వీకరించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. దళిత సాధికారత పథకం మొదటి విడత అమలులో భాగంగా ప్రతి నియోజకవర్గానికీ వంద కుటుంబాలను ఎంపిక చేసి ఉపాధి కల్పన కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
రానున్న నాలుగైదేళ్లలో దశల వారీగా రూ.45 వేల కోట్లతో దళితులకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి లబ్ధిదారులు, యూనిట్ల ఎంపిక కోసం చర్చించి దళిత సంఘాల నాయకులు, ప్రతినిధుల సూచనలు, సలహాలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంత్రి తెలిపారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ సాధికారత పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ దళితులు స్వయం శక్తిపై నిలబడాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని తీసుకొచ్చారన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, శిక్షణ కలెక్టర్ రాహుల్, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల రవికుమార్, వైరా జడ్పీటీసీ కనకదుర్గ, దళిత సంఘాల నాయకులు కొరిపల్లి శ్రీనివాస్, పుట్టా సుధాకర్, ప్రసాద్, పల్లా రాజశేఖర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.