న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. వాహన ధరలను మరోసారి పెంచినట్లు ప్రకటించింది. ఇందులో తమ పాపులర్ ఎస్యూవీ ‘థార్’ ధర కనిష్ఠంగా రూ.32,000, గరిష్ఠంగా రూ.92,000 పెరిగినట్లు తెలిపింది. ఆయా వేరియంట్ల ఆధారంగా ఈ ధరల పెంపు ఉంటుందని తాజాగా పేర్కొన్నది. ఈ నెల నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. నిజానికి ఈ ఏడాది మొదలు వాహన ధరలను మహీంద్రా పెంచడం ఇది మూడోసారి. గతంలో ఫిబ్రవరి, మే నెలల్లో రెండుసార్లు పెంచింది. కాగా, బొలెరో, మరాజ్జో, స్కార్పియో, ఎక్స్యూవీ300 మరికొన్ని మోడల్స్ కార్ల ధరలూ పెరిగాయి. అయితే 2 నుంచి 3 శాతం మేరకే పెంపున్నది. ఇక తయారీ ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు కారణమని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. అయితే వాహన శైలి, సాఫ్ట్టాప్, హార్డ్టాప్ తదితర కారణాల వల్ల థార్ ధర అధికంగా పెరుగుతున్నట్లు చెప్పింది.